టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత యం.ఎస్. రాజుకు ప్రత్యేక స్థానం వుంది. సంక్రాంతికి ఆయన ఏ సినిమా రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. దాంతో ఆయనని ఇండస్ట్రీ వర్గాలు సంక్రాంతి రాజు అని పిలుచుకునే వారు .. అలాంటి సంక్రాంతి రాజుకు గత కొంత కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వెంకటేష్ నటించిన `శత్రువు` సినిమాతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. విజయశాంతితో పోలీస్ లాకప్, ప్రేమతో `దేవి` వంటి విజయవంతమైన చిత్రాల్ని అందించారు.
అయితే వరుస సూపర్హిట్లతో సాగుతున్న ఆయన విజయాల పరంపరకు `దేవీ పుత్రుడు` పరాజయం భారీ షాకిచ్చింది. భారీగా నష్టపోయిన ఆయన తిరిగి ఉదయ్కిరణ్ నటించిన `మనసంతా నువ్వే` సినిమాతో మళ్లీ విజయాల బాటపట్టారు. ఈ సినిమా నుంచి సిద్ధార్థతో చేసిన `నువ్వోస్తానంటే నేనొద్దంటానా` వరకు వరుస విజయాల్ని తన ఖాతాలో వేసుకుని సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. సంక్రాంతికి ఆయన ఏ సినిమా రిలీజ్ చేసినా సూపర్ హిట్టే అన్న ముద్రపడిపోయింది. సక్సెస్ఫుల్ చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాజుగారి జాతకం `పౌర్ణమి`తో ఒక్కసారిగా మారిపోయింది.
ఆయన తొలిసారి డైరెక్టర్గా మారి తీసిన `వాన` మరింత నష్టాల్లోకి దించేసింది. దీనికి తోడు కొడుకుని హీరోగా నిలబెట్టాలన్నఆయన ప్రయత్నం తెరమరుగయ్యేలా చేసింది. కొంత విరామం తరువాత ఆయన బౌన్స్ బ్యాక్ కాబోతున్నారని తెలుస్తోంది. జనవరి 1న ఆయన సోషల్ మీడియా ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రేపు అంతా ఆశ్చర్యపోయే ప్రకటన చేయబోతున్నాను. షాకవ్వకండి` అని ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన ఇవ్వబోతున్న షాక్ ఏంటి? ఏం అనౌన్స్ చేయబోతున్నారు అన్నది తెలియాల్సి వుంది.