కలెక్షన్కింగ్ మోహన్బాబు తనయుడు మంచు విష్ణు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా కలుసుకోవడం తెలిసిందే. `ఈ రోజు బిగ్బాస్ని కలిశాను. ఎందుకు కలిశాను అనేది త్వరలోనే వెల్లడిస్తాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను` అంటూ మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా చిరుతో వున్న ఓ ఫొటోని పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు వున్నట్టుండి మెగాస్టార్ని కలవడం వెనకున్న ఆంతర్యమేంటి? అని రక రకాల ఊహాగానాలు వినిపించాయి.
ఇదిలా వుండగా కలెక్షన్కింగ్ మోహన్బాబు ఈ రోజు మెగాస్టార్ని `ఆచార్య` సెట్లో ప్రత్యేకంగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఇద్దరూ చిరకాల మిత్రులన్న విషయం అందిరికి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం `ఆచార్య`. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ శివారులో జరుగుతోంది.
ఈ సందర్భంగా బుధవారం మోహన్బాబు `ఆచార్య` సెట్స్కి వెళ్లారు. అక్కడ చిరుని స్నేహపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా బొకేతో సత్కరించారు. చిరకాల మిత్రుడైన మోహన్బాబు సెట్స్కి రావడంతో చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. ఈ ఇద్దరు మిత్రులు కొంత సమయం సినిమాలతో పాటు వివిధ ఆంశాలపై ముచ్చటించుకున్నారు. మోహన్బాబు ప్రస్తుతం `సన్ ఆఫ్ ఇండియా` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.