తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ ఈ గురువారం తన రాజకీయ ప్రకటన చేస్తానని గత కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అథిక రక్త పోటు కారణంగా హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చేరిన రజనీ ఒక్కసారిగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మూడు రోజుల తరువాత ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన రజనీ ఇప్పట్లో తను రాజకీ పార్టీని ప్రకటించడం లేదని వెల్లడించి షాకిచ్చారు.
రజనీ నుంచి ఊహించని ప్రకటన రావడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కానీ ఆయన శ్రేయోభిలాషులు మాత్రం రజనీ ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారని ఆయన నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా రజనీ మిత్రుడు, నటుడు కలెక్షన్కింగ్ మోహన్బాబు గురువారం స్పందించారు. `రజనీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి అందరికి తెలుసు. తన ఆరోగ్య రీత్యా రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించాడు. ఒక రకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం అభిమానులందరికీ బాధే అయినప్పటికీ ఒక స్నేహితుడిగా, అతని ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని నమ్ముతున్నాను` అన్నారు మోహన్బాబు.
నా మిత్రుడికి ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచి వాడివి, చీమకు కూడా హాని చేయని వాడివి. నా దృష్టిలో గ్రేటెస్ట్ పర్సన్. నీలాంటి వ్యక్తికి, నా లాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే మనం ఉన్నపది ఉన్నట్టుగా నిక్కచ్చిగా మాట్లాడుతాం. ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు సీట్లు కొనలేము.. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచి వాడివి అన్న నోళ్లే రేపు వచ్చాక చెడ్డ వాడివి అంటాయి. రాజకీయం ఒక రొచ్చు.. బురద.. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది. రజనీకాంత్ అభిమానులందరూ రజనీకాంత్ అంత మంచి వాళ్లే. మీరందరూ సహృదయంతో నా మిత్రుడు నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ – మీ మోహన్బాబు` అని మోహన్బాబు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.