తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. సామాన్యులు, మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్, పోలీస్ సిబ్బందికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. ఇటీవల రాజకీయ నాయకుల్ని సైతం కరోనా వణికిస్తూ వారికి కూడా సోకుతుండటం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఇటీవల అధికార పార్టీ నేతలకు సోకిన కరోనా వైరస్ తాజాగా సాక్ష్యాత్తు తెలంగాణ డిప్యూటీ సీఎం, హోమ్ మంత్రి మహమూద్ అలీకి కరోనా సోకడం పలువురిని షాక్కు గురిచేస్తోంది.
తెలంగాణ డిప్యూటీ సీఎం, హోమ్ మంత్రి మహమూద్ అలీ గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాగా పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా సోకినట్లు తెలిసింది. వెంటనే ఆయన జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్నరాత్రి చేరినట్టు తెలిసింది. మంత్రికి కరోనా సోకడంతో ఆయనతో సన్నిహితంగా వున్న వారంతా భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికే తెరాసకు చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కరోనా బారిన పడ్డారు. తాజాగా హోమ్ మంత్రే కరోనా బారిన పడటం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో సామాన్య జనం భయంతో మా పరిస్థితి ఏంటని బెంబేలెత్తిపోతున్నారు.