తమిళ హీరో సూర్య చుట్టూ మరో వివాదం అలుముకుంటోందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మించిన చిత్రం `పొన్మగల్ వందాల్`. జె.జె. ఫెడ్రీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కరోనా క్రైసిస్ కారణంగా తమిళ ఇండస్ట్రీ నుంచి ఓటీటీలో విడుదలైన చిత్రమిది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయరాదంటూ తమిళనాడు థియేటర్స్ యూనియన్ హీరో సూర్యకు ఆల్టిమేటమ్ జారీ చేసింది.
థియేటర్లని కాదని ఓటీటీలో రిలీజ్ చేస్తే భవిష్యత్తులో మీ సంస్థ నిర్మించే చిత్రాలని థియేటర్లలో రిలీజ్ చేయనివ్వమని హీరో సూర్యని హెచ్చరించారు. ఇది అప్పట్లో వివాదానికి దారితీసింది. సూర్య నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ చాలా మంది నిర్మాతలు ముందుకొచ్చారు. అయితే తాజాగా సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దురా` చిత్రం కూడా ఓటీటీ బాటపడుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన మంత్రి కడంబూర్ రాజు హీరో సూర్యపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుత సమయంలో సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేయడం సరికాదని, దీని వల్ల థియేటర్స్, ఇస్ట్రీబ్యూటర్స్ తీవ్ర నష్టాలని ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా సూర్య ప్రస్థావన తీసుకొచ్చిన ఆయన జ్యోతిక నటించిన చిత్రాన్ని హీరో సూర్య ఓటీటీలో రిలీజ్ చేయాల్సింది కాదని, ఈ విధానం వల్ల తమిళ చిత్ర పరిశ్రమ భారీగా నష్టపోతుందని, ఇప్పటికే సినీ పరిశ్రమ వేల కోట్లు నష్టాల్ని చవిచూస్తోందని, కరోనా కట్టడి అయ్యాకే ప్రభుత్వం థియేటర్లు రీఓపెన్ చేస్తుందని, అంత వరకు థియేటర్ల రీ ఓపెన్ కష్టమేనని స్పష్టం చేశారు.