మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్స్టార్ రామ్చరణ్ సిద్ధగా కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే రామ్చరణ్ కు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి మలయాళ హిట్ ఫిల్మ్ `లూసీఫర్` ఆధారంగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.
మోహన్రాజా దర్శకత్వంలో శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్, ఎన్ వి ఆర్ ఫిలింస్ బ్యానర్స్పై ఆర్.బి. చౌదరి, ఎన్.వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంఛనంగా పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఆర్.బి. చౌదరి, ఎన్ వి. ప్రసాద్, దర్శకుడు మోహన్రాజా, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్, కొరటాల శివ, వాకాడ అప్పారావు, జెమిని కిరణ్, రచయిత సత్యానంద్, డీవీవీ దానయ్య, మెహర్ రమేష్, తమన్, గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్రెడ్డి, నవీన్ యెర్నేని, శిరీష్ రెడ్డి, యూవీ క్రియేషన్స్ విక్కీ తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, మన నేటివిటీకి తగ్గట్టుగా మోహన్రాజా అద్భుతమైన మార్పులు చేశారని, మెగాస్టార్ కెరీర్లోనే మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఈ మూవీ నిలుస్తుందని నిర్మాతలు ఆర్.బి. చౌదరి, ఎన్.వి. ప్రసాద్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవిగారి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన అభిమానులు కోరుకునే రేంజ్లో ఈ సినిమా వుంటుంది. ఇది పూర్తి స్థాయి రీమేక్ కాదు. `లూసీఫర్` కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించబోతున్నాం` అని దర్శకుడు మోహన్రాజా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్, రచన లక్ష్మీ భూపాల్, కెమెరా నీరవ్ షా, ఆర్ట్ సురేష్ సెల్వరాజన్, లైన్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు, స్క్రీన్ప్లే, దర్శకత్వం మోహన్రాజా.