ఈ నెల 17 నుంచి లాక్డౌన్ ని 31 వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్ 4.ఓ పేరుతో దేశ వ్యాప్తంగా కొన్నింటికి వెసులు బాటు కల్పిస్తూ మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో రాష్ట్రాల్లో కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా అంతా గ్రీన్ జోన్లుగా ప్రకటిస్తూ అంతర్గత ప్రజా రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీంతో మళ్లీ జనజీవితం రోడ్డెక్కింది. సాధారణ జీవితం మళ్లీ గాడిన పడింది.
దీంతో సినిమా థియేటర్లు, షూటింగ్లు మళ్లీ రీ స్టార్ట్ అవుతాయని సినిమా వాళ్లలో ఆశలు మొదలయ్యాయి. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో కదలిక మొదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. తాజాగా బాలీవుడ్ బిగ్గీస్ కూడా ముంబై ప్రభుత్వాన్ని షూటింగ్లకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. టాలీవుడ్ పెద్దలు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ విషయమై సంప్రదించాలని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఈ విషయమై ఈ నెల 21న గురువారం ఓ మీటింగ్ జరగబోతున్నట్టు తెలిసింది. లీడింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు అంతా కలిసి చిరంజీవి ఆఫీస్లో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నట్టు తెలిసింది. ఈ మీటింగ్లో ప్రభుత్వం ముందుకు ఎలాంటి ప్రణాళికతో వెళ్లాలి? అనే దానిపై చచర్చించి పూర్తి ప్రణాళికతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రకేఖర్రావు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. లాక్డౌన్ కారణంగా ఆర్ ఆర్ ఆర్, ఆచార్య, ప్రభాస్ జాన్, అల్లు అర్జున్ `పుష్ప` వంటి భారీ చిత్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మిగతా రాష్ట్రాల తరహాలో తెలంగాణ ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తుందో .. మరి కొన్ని నెలలు వేచి చూడాలిన సూచిస్తుందో చూడాలి అంటున్నారు.