క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొంత విరామం తరువాత `రంగ మార్తాండ` చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. నానా పటేకర్ నటించిన మరాఠీ చిత్రం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక, రాహుల సిప్లిగంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో వుంది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత `అన్నం` పేరుతో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్టు ప్రకటించారు. మహా శివరాత్రి సందర్భంగా టైటిల్ పోస్టర్ని కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. అరిటాకు విస్తరిపై బియ్యంతో రాసిన టైటిల్.. రక్తమోడుతున్న కొడవలి… మంగళసూత్రం.. ఈ టైటిల్లో కనిపించాయి. రైతు సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి నటించే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని కృష్ణవంశీ త్వరలోనే వెల్లడించే అవకాశం వుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. `రైతు` పేరుతో ఓ చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా తెరకెక్కించాలని కృష్ణవంశీ గత కొన్ని నెలల క్రితం ప్లాన్ చేసి విఫలమైన విషయం తెలిసిందే.