మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ అన్నీ అడ్డంకులే. నిత్యం వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. షూట్ మొదలైన తొలి నాళ్లలో క్యారవాన్ ల కారణంగా వార్తల్లో నిలిచింది. ఆ తరువాత కెమెరామెన్ మారాడంటూ మరో సారి చర్చనీయాంశంగా మారింది. ఇక త్రిష వివాదం గురించి తెలిసిందే.
తను కావాలనే సినిమా నుంచి తప్పుకుందని చిరు వివరణ ఇస్తే త్రిష మాత్రం వేరే కారణాలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత కాజల్ అగర్వాల్ ని హీరోయిన్గా తీసుకున్నారు. ఆ తరువాత నిర్మాతగా రామ్చరణ్ గురించి పుకార్లు వినిపించాయి. దీంతో మరో నిర్మాత నిరంజన్ రెడ్డి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా వీటన్నింటిని దాటి ఈ నెల 9న మూవీ షూటింగ్ రీ స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తే చిరుకు కరోనా సోకినట్టు తెలియడంతో ఆ ప్రయత్నానికి బ్రేక్ పడింది.
దీంతో `ఆచార్య` పట్టాలెక్కాలంటే మరో రెండు నెలలు వేచి చూస్తే మంచిదని దర్శకుడు కొరటాల శివ భావిస్తున్నారట. చిరు ప్రస్తుతం క్వారెంటైన్కి వెళ్లిపోయారు. ఆయన 14 రోజుల తరువాతే ఫ్రీ అవుతారు. అంటే ఈ నెలాఖరు వరకు అన్నమాట. అంటే నవంబర్ నెల కూడా గడవాల్సిందే. పరిస్థితులని బట్టి డిసెంబర్ నెల కూడా చూసి జనవరిలో స్టార్ట్ చేస్తే బాగుంటుందన్నది కొరటాల ప్లాన్. దీనికి చిరు కూడా ఓకే అన్నట్టు చెబుతున్నారు. అంటే `ఆచార్య` పట్టాలెక్కాలంటే రెండు నెలలు ఆగాల్సిందే అన్నమాట.