2003లో అల్లరి నరేష్, సదా జంటగా వచ్చిన చిత్రం `ప్రాణం`. మల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కమలాకర్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటలు ఇప్పటికీ ఆకట్టుకుంటూనే వున్నాయి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. మాగంటి బాబు నిర్మించిన ఈ సినిమా చాలా మందికే నిద్రలేని రాత్రుల్ని మిగిల్చిందట. ఆ విషయాన్ని యువ దర్శకుడు మారుతి ఆదివారం మీడియా ముఖంగా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
మారుతి తెరకెక్కించిన తాజా చిత్రం `ప్రతిరోజు పండగే`. సాయిధరమ్తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి మౌత్ టాక్తో సక్సెస్ ఫుల్గా రన్నవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆదివారం థాంక్స్ మీట్ని నిర్వహించింది. ఈ కార్యక్రంలో పాల్గొన్న మారుతి తన లైఫ్ని మలుపుతిప్పిన `ప్రాణం` సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డిస్ట్రిబ్యూటర్గా తన కెరీర్ ప్రారంభం అయిందని, ఒకానొక సందర్భంలో `ప్రాణం`అనే చిత్రాన్ని కొంటే అది తన ప్రాణాలు తీసినంతపని చేసిందని చెప్పుకొచ్చారు.
`ప్రాణం` కారణంగా నష్టపోయిన తాను ఇండస్ట్రీకి దూరంగా వెళ్లాలనుకున్నానని, అదే సమయంలో సుకుమార్ `ఆర్య` చిత్రాన్ని తీశారని, అప్పుడు దర్శకుడిగా సుకుమార్ కొత్తే ఆయినా సినిమా బాగుందని బన్నీ వాసు చెప్పడంతో తన దగ్గర డబ్బు లేకపోయినా తన భార్య దగ్గరున్న 5 లక్షలు తీసుకుని ఆ చిత్రాన్ని పాలకొల్లు ఏరియాకు కొన్నామని, ఆ సినిమాలు లాభాలు తెచ్చిపెట్టిందని, తాను ఈ రోజు ఇండస్ట్రీలో వున్నానంటే దర్శకుడు సుకుమార్ కారణమని అసలు విషయం చెప్పారు. తాను రూపొందించిన `ప్రతిరోజు పండగే` ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతోందని, ఈ సినిమా విజయంలో తనలో మరింత కసి పెరిగిందని, ప్రేక్షకుల్ని మరింతగా నవ్వించాలని నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా మారుతి వెల్లడించారు.