పాన్ ఇండియా సబ్జెక్ట్ తో ఎన్ని సినిమాలు వస్తున్నా, సినీ మీడియా ప్రతి సినిమాను బహుబలితో పోల్చి కథనాలు ప్రసారం చేస్తున్నారు. సినిమా కథా, కథనాల పరంగా ఎలా ఉన్నా, కలెక్షన్స్ పరంగా ఆ సినిమా సాధించిన రికార్డులు ఇందుకు కారణం కావచ్చు. అసలు రాజమౌళి కంటే ముందు ఇండస్టీ కి పాన్ ఇండియా సినిమాలు అలవాటు చేసిన దర్శకులలో ఒకరు మణిరత్నం. కథ, స్క్రీన్ ప్లే ,టెక్నాలజీ, టేకింగ్ మరీ ముఖ్యంగా ఫ్రేం సెన్స్ ఇలా మణిరత్నం గారి ప్రతి సినిమా ఎంతో డీటేయిలింగ్ తో కూడి ఉంటుంది. అందరికంటే ముందు ఇండస్ట్రీ లో హేమాహేమీలు వంటి నటులతో మల్టీ స్టారర్ సినిమాలు చేసి హిట్ కొట్టిన వ్యక్తి మణి సార్.
తన ప్రతీ సినిమాకు మూల కథను రామాయణం, మహాభారతం నుండే తీసుకునే మణి గారు ప్రస్తుతం కల్కి కృష్ణమూర్తి గారు రాసిన 2400 పేజీల “పోన్నియన్ సెల్వన్” అనే మహా గ్రంధం ఆధారంగా భారీ సినిమాను చేస్తున్నారు. గతంలో ఏంజీఆర్ వంటి మహానటులు సైతం ఆ ప్రాజెక్టు చెయ్యాలని అనుకున్నారు. పోన్నియ్యన్ సెల్వన్ అంటే కావేరి పుత్రుడు అని అర్ధం. ఈ కథ 10 – 11 శతబ్దాలలో భారత ఖండాంతరాలు దాటి సామ్రాజ్యం విస్తరించిన, చోళ రాజు ఆరుల్మోజి వర్మన్ కి చెందినది.
ఇతను రాజుగా పట్టాభిషేకం తరువాత, రాజ రాజ చోళునిగా ప్రసిద్ధి చెందాడు. ఇతని పాలనా మరియు అతని తరువాత వచ్చిన రాజుల హయాంలో చోళ సామ్రాజ్యం ఉచ్ఛ దశకు చేరుకుంది. ఇప్పుడు అపూర్వ గాధను మణిరత్నం వెండితెరపై మనకు చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో మొదలైంది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. విక్రం, కార్తి, ఐశ్వర్య రాయ్, విక్రం ఇంకా ఎంతో మంది పెద్ద నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
తీసే ప్రతి సినిమాను ఒక దృశ్య కావ్యంగా తీర్చిదిద్దే మణిరత్నం ఈ సినిమాను ఒక ఎపిక్ స్థాయిలో తీర్చిదిద్దుతాడనడం లో ఏం సందేహం లేదు.