ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మన ఇండియాని కూడా వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడులో భీభత్సం సృష్టిస్తోంది. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా వుంటే దర్శకుడు మణిరత్నం మాత్రం సెప్టెంబర్ నుంచి పూనేలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారట.
మణిరత్నం తెరకెక్కిస్తున్న డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియన్ సెల్వన్`. కల్కీ కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని మణిరత్నం అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. `బాహుబలి` తరహాలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యలక్ష్మి, ఆదితీరావు హైదరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని సెప్టెంబర్ నుంచి పూనేలో ప్రారంభించాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే థాయ్లాండ్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. మరో కీలక ఘట్టాన్ని పూనేలో పూర్తి చేయాలనుకుంటున్నారట. అయితే కరోనా కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ముందు రిలీజ్ చేసి ఆ తరువాతే హిందీ వెర్షన్ని రిలీజ్ చేయాలని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట.