హీరో అంటే సినిమాలే కాదు సామాజిక బాధ్యత కూడా వుండాలని చాలా మంది హీరోలు నిరూపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా మధ్యతరగతి జీవితాలు నిత్యావసరాల కోసం ఇబ్బందిపడుతున్న వేళ నేనున్నానంటూ భయ హస్తం అందించారు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఆయన తరహాలోనే మరో మహాత్తర కార్యక్రమానికి హీరో మంచు విష్ణు శ్రీకారం చుట్టబోతున్నారు. సాయుధ బలగాల గురించి అందులోనూ తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ విషయాన్ని గురువారం సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఆర్మీలో తెలుగు జవాన్ల వీరత్వాన్ని, వారి త్యాగాన్ని చూపే వీడియోలు, ఫొటోలు ఎవరి దగ్గరైనా ఉంటే తనకు పంపించాలని ఈ సందర్భంగా మంచు విష్ణు కోరుతున్నారు.
`ప్రపంచంలో మనం నిత్యం శిరస్సు వంటి నమస్కరించాల్సిన వారు ముగ్గురు. బిడ్డకు జన్మనిచ్చే తల్లి.. మన ఆకలి తీర్చే రైతన్న.. తన కుంటుంబానికి దూరమై మన భద్రత కోసం దేశ సరిహద్దుల్లో కాపలా కాసే వీర జవాన్. ఈ ముగ్గురికి లభించాల్సిన గుర్తింపు దక్కట్లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయులైన కన్నతల్లుల్ని, కష్టజీవులైన రైతన్నలను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీర జవాన్లను కలిసే అదృష్టం మాత్రం నాకెప్పుడూ కలగలేదు. ఇప్పుడు భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాను. ప్రపంచంలో సమర్ధవంతమైన భారత ఆర్మ్డ్ ఫోర్సెస్లో అడుగుపెట్టి మన దేశాన్ని గర్వించేలా చేస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా ఆర్మీలో తమదైన ముద్ర వేసిన తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా మన తెలుగు వీరసైనికుల త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వాళ్ల పేర్లు ఉంటే నా సోషల్ మీడియా అకౌంట్కి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంతో వాళ్ల వీరకథల్ని పంచుకుందాం. జై జవాన్.. జై కిసాన్.. జైహింద్!` అంటూ మంచు విష్ణు వీడియో షేర్ చేశారు.