దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు దీని కారణంగా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. అయితే లాక్ డౌన్ ప్రకటించిన తరువాత పరిస్థితిలో కొంత మార్పు కనిపించింది. అన్ని బంద్ కావడంతో సామాన్యులు, డైలీ పని చేస్తేనే కడుపునిండే వారు కొంత ఇబ్బందులకు గురవుతున్నారు.
దీంతో వారిని ఆదుకోవడానికి సినీ తారలు మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కొంత మందేమో నిత్యావసర సరుకుల్ని సమకూర్చి తమ ఉదారతను చాటుకుంటున్నారు. ఇటీవల తారలంతా విరాళాలు ప్రకటించడంతో మేము సైతం అంటూ మంచు ఫ్యామిలీ హీరోలు మంచు మోహన్బాబు ఆయన తనయుడు మంచు విష్ణు ఎనిమిది ఊళ్ల ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు.
తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజక వర్గంలోని 8 గ్రామాల్ని దత్తత తీసుకుని ఆ గ్రామాల్లోని వారికి రెండు పూటలా భోజనాన్ని అందిస్తూనే 8 టన్నుల కూరగాయల్ని కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ మంచు ఫ్యామిలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచు మోహన్బాబు చిత్తూరు జిల్లాలోని మోదుగుల పాలెంలో జన్మించారు.