సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో మహేష్ నటించిన `సరిలేరు నీకెవ్వరు` సంచలన విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో అనిల్ సుంకరతో కలిసి దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పండగ చిత్రాల రేసులో మంచి ఫలితాన్నే సాధించిన ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లని సాధించే అవకాశం వుందని చెబుతున్నారు.
ఇదిలా వుండగా మహేష్ తన తదుపరి చిత్రం కోసం మూడు నెలలు విశ్రాంతి తీసుకుంటానని ఇటీవల ప్రకటించారు. అందు కోసం ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిపోయారాయన. అయితే మహేష్ మోకాలి చికిత్స కోసమే అమెరికా వెళ్లారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. 2014లో వచ్చిన `ఆగడు` సినిమా చిత్రీకరణ సమయంలో మహేష్ మోకాలికి గాయమైందట. అప్పటి నుంచి ఆ గాయం బాధిస్తున్నా మహేష్ లైట్ తీసుకున్నారట.
చివరికి పెయిన్ ఎక్కువ కావడంతో పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ కచ్చితంగా చేయాలని, తరువాత ఐదు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారట. 2017లో ఆపరేషన్ చేయించాలని ప్రయత్నించినా బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా వేసుకున్నారట. తాజాగా `సరిలేరు నీకెవ్వరు` ప్రమోషన్స్ అన్నీ పూర్తయి ఫ్రీ అయిపోవడంతో సర్జరీ కోసమే మహేష్ అమెరికా వెళ్లారని తెలుస్తోంది. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా అంగీకరించిన విషయం తెలిసిందే.