సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు చాలా పరిణితి సాధించాడు. గతంలో మొహమాటానికి పోయి సినిమాలు చేసి ప్లాపులు అందుకున్న మహేష్ లో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడైనా సరే మొహమాటంతో సినిమా చెయ్యట్లేదు. సాధారణంగా మహేష్ కు దర్శకులతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దర్శకులు అందరూ మహేష్ ను డైరెక్టర్స్ హీరో అని పిలుస్తారంటేనే అర్ధం చేసుకోవచ్చు అతను దర్శకులకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇస్తాడో. అలాంటిది ఇప్పుడు మహేష్ దర్శకుడు ఎలాంటి వాడైనా సరే తనకు కథ నచ్చితేనే ముందుకు తీసుకెళ్తున్నాడు.
పూరి జగన్నాథ్ తనకు రెండు సినిమాలు హిట్లు ఇచ్చాడు. సుకుమార్ తనను ఎవరూ చూపించని రీతిలో చూపించాడు. 1 నేనొక్కడినే తను ఎప్పుడూ గర్వపడే సినిమాగా నిలుస్తుంది అని చెప్తాడు మహేష్. అయినా కానీ పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చలేదని తనతో సినిమా చేయలేదు. సుకుమార్ తో కూడా 1 ఇయర్ పాటు ట్రావెల్ చేసి కథ విషయంలో సంతృప్తి పడక నో ఛాన్స్ అనేశాడు. అయితే సుకుమార్ పై తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని అప్పట్లో ప్రకటించాడు మహేష్.
ఇప్పుడు వంశీ పైడిపల్లి వంతు వచ్చింది. మహర్షి సినిమాతో మంచి హిట్ కొట్టాడు మహేష్. ఆ సమయంలో వంశీ పైడిపల్లితో భలే స్నేహం కుదిరింది. తన తర్వాతి సినిమాలో కూడా హీరోగా చేయడానికి ఓకే అన్నాడు. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ చెట్టెక్కేసినట్లేనని తెలుస్తోంది. ఈ సినిమా స్థానంలో పరశురామ్ తో సినిమా ఓకే చేయనున్నాడు మహేష్. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
వంశీ పైడిపల్లి మహేష్ తో మాఫియా బ్యాక్ డ్రాప్ తో ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. దాదాపు ఎనిమిది నెలల పాటు దీనిపై కూర్చున్నాడు. అయితే ఇప్పుడీ సినిమా లేదని తేలిపోయింది. దీంతో వంశీ పైడిపల్లి మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు.
ఇలా కథ విషయంలో రాజీ పడని నేచర్ వల్ల మహేష్ తో సినిమా అంటే అంత వీజీ కాదు అనేస్తున్నారు.