కరోనా వైరస్ కారణంగా చాలా వరకు సినిమాల షూటింగ్లు మధ్యలోనే ఆగిపోయాయి. పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్లీ తిరిగి షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొంత మంది ఇప్పటికే షూటింగ్స్ మొదలుపెట్టేశారు. ఇటీవల `కేజీఎఫ్ చాప్టర్ 2` రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే.
తాజాగా మరో చిత్రం కూడా బ్యాలెన్స్గా వున్న షూటింగ్ ని ప్రారంభించబోతోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `లవ్ స్టోరీ`. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సెన్సిబుల్ మూవీస్ని తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
15 రోజులు మినహా చిత్రీకరణ లాక్డౌన్ బిఫోర్ పూర్తి చేశారు. బ్యాలెన్స్గా వున్న షూటింగ్ ని సెప్టెంబర్ 7నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిసింది. ప్రత్యేకంగా కోవిడ్ జాగ్రత్తల్ని పాటిస్తూ చిత్ర బృందం బ్యాలెన్స్ షూటింగ్ని పూర్తి చేయడానికి అన్ని విధాలా సిద్ధమైనట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.