పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీకి మూడు సినిమాలను లైన్లో సెట్ చేసుకున్న విషయం తెల్సిందే. అందులో మొదటిది పింక్ రీమేక్ వకీల్ సాబ్ కాగా రెండోది క్రిష్ దర్శకత్వంలో సినిమా. ఈ సినిమాకు విరూపాక్ష అన్న టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు మొదలై ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది కూడా.
అన్ని సినిమాలతో పాటే ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇకపోతే ప్రస్తుతం క్రిష్ వేరే చిత్రానికి వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యంగ్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ ఒక చిత్రాన్ని రూపొందిస్తున్నాడట. పవన్ సినిమా లైన్లో ఉండగా ఇలా మరో సినిమా మొదలుపెట్టడంతో పవన్ సినిమాపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా తెల్సిన విషయమేమిటంటే క్రిష్ పవన్ సినిమాను పూర్తిగా సైడ్ చేయలేదట. ప్రస్తుతం షూటింగులు చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలించకపోవడంతో పవన్ కళ్యాణ్ షూటింగ్స్ ను వాయిదా వేసాడు. అయితే నవంబర్ నుండి పవన్ సినిమాల్లో తిరిగి నటించే అవకాశముంది. అయితే ముందుగా వకీల్ సాబ్ షూటింగ్ ను పూర్తి చేసుకున్న తర్వాతే పవన్ మరో సినిమా మొదలుపెడతాడు. అంటే వచ్చే ఏడాదే పవన్ విరూపాక్షకు డేట్స్ ఇవ్వవచ్చు. అందుకే క్రిష్ ఈలోగా సినిమా చేస్తున్నాడన్నమాట.