టాలీవుడ్ అంటే బాక్సాఫీస్ లెక్కలు… రికార్డులు.. ఫ్యాన్స్ మధ్య గొడవలు.. అది పరిస్థితి బాగున్నంత వరకే.. సమాజం ఇబ్బందుల్లో పడిందా ఆ లెక్కలన్నీ మారిపోతాయి. అప్పటి వరకు బాక్సాఫీస్ లెక్కలు, రికార్డులు, ఫ్యాన్స్ని సంతృప్తి పరచాలనే మాటలు అన్నీ పక్కన పడతాయి. ముందున్న లక్ష్యం ఒక్కటే.. ఆపదలో వున్నారికి మనం ఎలా? ఏ విధంగా అండగా నిలవాలన్నదే ప్రధాన లక్ష్యంగా మారుతుంది. అంతా ఒక్కతాటిపై చేరి వచ్చిన ఆపద నుంచి జనాన్ని ఎలా రక్షించాలి. అందుకు తాము ఏంచేయాలో ఆ పని చేయడం ప్రారంభిస్తారు.
తాజాగా కరోనా వైరస్ కారణంగా ప్రపంచం వణికిపోతోంది. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో మన దేశంలో ప్రధాని మోదీ లాక్ డౌన్ని ప్రకటించారు. 21 రోజుల పాటు ఈ లాక్ డౌన్ అమల్లో వుంటుంది. మరో రెండు వారాలు ఈ లాక్ డౌన్ వుండబోతోంది. దీంతో స్టార్లు తమ వంతు బాధ్యతగా విరాళాలు ప్రకటించారు. ప్రకటిస్తున్నారు. అంతటితో ఆగకుండా జనాన్ని వైరస్ పట్ల ఎలా వ్యవహరించాలో అవగాహన కల్పిస్తున్నారు. విజయ్ దేవరకొండ నుంచి ఈ అవేర్ నెస్ కు సంబంధించిన వీడియోల పరంపర మొదలైంది.
దాన్ని మెగాస్టార్ చిరంజీవి మరో స్థాయికి తీసుకెళ్లారు. షూటింగ్లు ఆగిపోవడంతో అల్లాడిపోతున్న సినీ కార్మికుల కోసం కోటి విరాళం ప్రకటించిన చిరు కరోనా బారిన పడకుండా ఎలా తమని తాము రక్షించుకోవాలో వీడియో ద్వారా వివరించారు. తాజాగా మరో అడుగు ముందుకేసి ఓ వీడియో సాంగ్లో పాలు పంచుకున్నారు. కోటి రూపొందించిన కరోనా సాంగ్లో చిరుతో పాటు నాగార్జున, వరుణ్తేజ్, పాయి ధరమ్తేజ్ కూడా పాలు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. నెటిజన్స్ మాత్రం టాలీవుడ్ స్టార్స్ కరోనా అవేర్నెస్ భేష్ గురూ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.