బిగ్బాస్ సీజన్ 4 రియాలిటీ షోతో సినిమా షూటింగ్లతో యమ బిజీగా గడిపేశారు కింగ్ నాగార్జున. బుల్లితెరపై బిగ్బాస్ హోస్ట్గా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సీజన్ 4 పూర్తవడంతో కొంత రిలాక్స్ అయిన కింగ్ నాగ్ ప్రస్తుతం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నెం. 49లో ప్రత్యేకంగా మొక్కలు నాటారు.
తమ కాలనీ పచ్చదనంతో అహ్లద వాతావరణంలో వుండాలనే సదుద్దేశ్యంతో మొక్కలు నాటే కార్యక్రమంలో వాల్గో ఇన్ ఫ్రా ఎండీ, సీఇవో శ్రీధర్ రావు గారితో కలిసి నాగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా జూబ్లీహిల్స్ సోసైటీ పార్క్ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసి శంకుస్థాపన చేశారు. అక్కడ ఎన్నో ప్రత్యేకమైన చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తరువాత అక్కడే ఒక చెట్టుకింద కూర్చుని నాగార్జున కాసేపు కూర్చుని ప్రకృతిని ఆస్వాదించారు.
మాస్టర్ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకుని నాగ్ కాసేపు చిన్నారితో ఆడుకున్నారు. ఆ తరువాత కాలనీ వాసులతో మాట్లాడి చెట్లు పెంచుతున్న వాళ్లని ప్రశంసించారు. పచ్చదనం కోసం ఇలాగే మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన సరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్రెడ్డి, అశోక్బాబు తదితరలు పాల్గొన్నారు.