కరోనా కారణంగా ప్రతీ రంగం ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. సినీ రంగం పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. రిలీజ్కి రెడీగా వున్న సినిమాలకు థియేటర్లు లేవు. మధ్యలో ఆగిపోయిన సినిమాలని పూర్తి చేద్దామంటే హీరోల నుంచి స్పందన లేదు. కొత్త సినిమాలు మొదలుపెట్టాలన్నా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు రిలీజ్కి నోచుకోవడం లేదు.
భారీ చిత్రాలు షూటింగ్ చేయడానికి ఇష్టపడని పరిస్థితి. ఇదిలా వుంటే కరోనా కారణంగా ఆగిపోయిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2`. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` చిత్రం దేశ వ్యాప్తంగా నాలుగు భాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్గా `కేజీఎఫ్ చాప్టర్ 2`ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు.
20 శాంతం చిత్రీకరణ మినహా `కేజీఎఫ్ చాప్టర్ 2` షూటింగ్ మొత్తం పూర్తయింది. తాజా సమాచారం ప్రకారం ఆ 20 శాతం చిత్రీకరణను ఈ నెల 15 తరువాత నుంచి ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అక్టోబర్లో పరిస్థితులని బట్టి `కేజీఎఫ్ చాప్టర్ 2` రిలీజ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.