కరోనా దెబ్బ దేశ వ్యాస్తంగా వున్న సినీ ఇండస్ట్రీలపై భారీగానే పడింది. చాలా మందికి పని పోయింది. కార్మికులు రోడ్డున పడ్డారు. మేకర్స్ కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందా? అని గత రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. కొంత మంది అంత కాలం సెట్లకు రెంట్ కట్టలేక కూల్చేస్తున్నారు. రిలీజ్లకు అవకాశం లేకపోవడంతో కొన్ని చిత్రాలు నేరుగానే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కొన్ని వేచి చూడాలనే ధోరణిలో వున్నాయి.
ఇదిలా వుంటే కరోనా కారణంగా భారీ చిత్రాల రిలీజ్లు, షూటింగ్ షెడ్యూల్స్ కూడా మారిపోతున్నాయి. కరోనా విజృంభనకు ముందు అనుకున్న రిలీజ్ డేట్లని మారుస్తున్నారు. షూటింగ్లకు ప్రభుత్వాలు అనుమతి ఇస్తారో లేదో తెలియకపోవడంతో తమ సినిమాల రిలీజ్ డేట్లని మారుస్తున్నారు. తాజాగా సంచలన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 2` రిలీజ్ డేట్ కూడా మరుతున్నట్టు తెలుస్తోంది. కన్నడలో తెరకెక్కి సంచలనం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`.
యష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది. రవీనా టాండన్, సంజయ్దత్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ముందు అక్టోబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్ర రిలీజ్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనుందని తెలిసింది.