కరోనా సినీ ఇండస్ట్రీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. థియేటర్లని మూసివేసేలా చేసింది. దీంతో రిలీజ్కి సిద్ధంగా వున్న చిత్రాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. కొంత మంది తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక నానా అంటాలు పడుతున్నాయి. ఇక కరోనా వల్ల షూటింగ్ లు చేయలేని పరిస్థితి. కరోనా కారణంగా మొదలై మధ్యలో ఆగిపోయిన సినిమాలు చాలా వున్నాయి. స్టార్ హీరోలు చిత్రాల గురించి చెప్పాల్సిన పని లేదు. వందల కోట్ల బడ్జెట్తో మొదలైన చిత్రాలు చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నా మిగతా భాగాన్ని పూర్తి చేయలేని పరిస్థితి.
ఇక రిలీజ్కి సిద్ధమై థియేటర్లు తెరుచుకోక.. ఓటీటీకి అమ్మేయలేక ఊగీసలాడుతున్న చిత్రాలు చాలానే వున్నాయి. అందులో కొన్ని ఆర్థిక ఒత్తిడికి తట్టుకోలేక ఓటీటీకి జై కొడుతున్న సినిమాల జాబిత కూడా పెరుగుతోంది. ఈ వరుసలో కీర్తి సురేష్ నటిస్తున్న మరో చిత్రం కూడా చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కీర్తి నటించిన `పెంగ్విన్` ఓటీటీలో రిలీజ్ కాగా `మిస్ ఇండియా` చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్ కానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా `గుడ్ లక్ సఖీ` కూడా ఓటీటీకే రానున్నట్టు తాజాగా వినిపిస్తోంది.
ఇటీవల విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన రావడంతో ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ 13 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అత్యంత తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి ఇది బిగ్ ఆఫర్ అని మేకర్స్ కూడా ఈ ఆఫర్కు ఇంప్రెస్ అయ్యారని తెలిసింది. దీంతో కీర్తి సురేష్ నటించి మూడవ సినిమా కూడా ఓటీటి బాటపడుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.