నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘118’ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తాజాగా కీర్తి సురేష్తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.. యువ నిర్మాత మహేష్ కోనేరు ఎక్కడా రాజీ పడకుండా అద్భుతమైన క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే యూరప్లో ఈ చిత్రానికి సంభందించిన కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఆగస్ట్ 26న ఈ చిత్రానికి ‘మిస్ ఇండియా’ అనే పేరును ఖరారు చేసారు. అలాగే ఫస్ట్లుక్ని విడుదల చేసారు చిత్ర యూనిట్.
చిత్ర నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ… ‘‘కీర్తి సురేష్ నుంచి ఇప్పుడు ప్రేక్షకులు ఎలాంటి సినిమాని కోరుకుంటారో, అలాంటి సినిమానే ‘మిస్ ఇండియా’. ప్రతి అమ్మాయి తన జీవితంలో ఎక్కడో ఒక చోట ఎదుర్కొనే పరిస్థితుల నేపథ్యంలో దర్శకుడు నరేంద్రనాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహిళలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందీ చిత్రం. మహానటి వంటి గొప్ప చిత్రం తరువాత కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం ఇది. ఆ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అలాంటి గొప్పనటి మా సంస్థలో నటించడం మాకేంతో ఆనందంగా ఉంది. ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన బ్యాలెన్స్ వర్క్ ని పూర్తిచేసి, అక్టోబరు లేదా నవంబరులో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.
దర్శకుడు నరేంద్రనాథ్ మాట్లాడుతూ.. ‘‘కీర్తి సురేష్ మాత్రమే న్యాయం చేయగల కథ ఇది. అందుకే ఈ కథ సిద్ధమయ్యాక ఆమెకి వినిపించగానే నచ్చి ఒప్పుకొన్నారు. అన్ని రకాల భావోద్వేగాలున్న చిత్రం’’ అన్నారు ఈ చిత్రానికి సంగీతం: తమన్.