సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ మారిపోయింది. నటిగా 66వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ నటి అవార్డుని దక్కించుకుని మరింత గుర్తింపుని, స్టార్ డమ్ నీ సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి వరుసగా నటనకు ప్రాధాన్యత వున్న చిత్రాల్ని మాత్రమే ఎంచుకుంటూ వస్తోంది. కీర్తి సురేష్ నటించిన `పెంగ్విన్` ఇటీవలే ఓటీటీలో విడుదలై మంచి ఆదరణను సొంతం చేసుకుంది. మరో చిత్రం `మిస్ ఇండియా` రిలీజ్కు సిద్ధంగా వుంది.
తెలుగులో నితిన్తో `రంగ్దే`, మహేష్తో `సర్కారు వారి పాట` చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో సూపర్స్టార్ రజనీ నటిస్తున్న `అన్నాత్తే`లో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇందులో కీర్తికి తల్లిగా నయనతార కనిపించనుందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుంటే 40 ఏళ్ల క్రితం తమిళ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన క్లాసిక్ చిత్రం `ఎర్ర గులాబీలు` సీక్వెల్కి కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్హాసన్, శ్రీదేవి జంటగా నటించారు. అప్పట్లో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ని చేయాలని భారతీరాజా తనయుడు మనోజ్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం కీర్తి సురేష్ని ఇటీవల సంప్రదించారట. క్లాసిక్ మూవీకి సీక్వెల్ కావడంతో కీర్తి ఆసక్తిగా వుందని తెలిసింది.