`సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్నారు మహేష్బాబు.ఈ సినిమా సక్సెస్ ఆనందంలో తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. `సర్కారు వారి పాట` పేరుతో యంగ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్ ప్లస్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేసింది.
భారతీయ బ్యాంకింగ్ వ్యవవస్థపై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు లుక్ కూడా కొత్తగా వుండటంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా వుంటే ఈ చిత్రంలో మహేష్ జోడీగా ఎవు నటిస్తారనే చర్చ మొదలైంది. ముందు కియారా అని, ఆ తరువాత సయీ ముఖర్జీ నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో నటి పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఆమే కీర్తి సురేష్. `మహానటి` తరువాత అత్యధికంగా మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్న కీర్తి సురేష్ అయితే బాగుంటుందని మేకర్స్ భావించి ఇటీవలే ఆమెని సంప్రదించారట. మేకర్స్ ఆఫర్కి కీర్తి సురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. హీరో మహేష్ కొత్త తరహా పాత్రలో నటించనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ని ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.