`సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మహానటి` కీర్తి సురేష్ కెరీర్ని ఓ మలుపు తిప్పింది అని చెప్పొచ్చు. తనదైన మార్కు నటనతో సావిత్రినే మరిపించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డుని దక్కించుకున్న ఆమె ఆ తరువాత పాత్రకు ప్రాధాన్యత వున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది. ఆమె నటించిన తాజా చిత్రం `పెంగ్విన్`. కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రం ద్వారా ఈశ్వర్ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
విభిన్నమైన కథాంశంతో ఓ మహిళ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లాక్డౌన్, థియేటర్లు మూసివేసిన కారణంగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. భారీ మొత్తాన్ని చెల్లించి ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ నెల 19న ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయబోతోంది.
ఈ సందర్భంగా ఈ చిత్ర టీజర్ని ఈ నెల 8న రిలీజ్ చేయబోతున్నారు. కీర్తిసురేష్ నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుంటుందని, కీర్తిసురేష్ నుంచి కొత్త తరహీ చిత్రాల్ని ఆశించే వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.