మిర్చి, బాహుబలి, హైపర్, ప్రతి రోజుపండగే చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు తమిళ నటుడు సత్యరాజ్. `బాహుబలి`తో కట్టప్పగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇన్నేళ్ల కెరీర్లో హీరోగా నటించి హిట్ చిత్రాల్ని అందించినా ఆయన కేవలం తమిళ చిత్ర పరిశ్రమకే పరిమితం అయిపోయారు. కానీ `బాహుబలి`లో పోషించిన కట్టప్ప పాత్రతో దేశ వ్యాప్తంగా ప్రభాస్ తరువాత వినిపించిన పేరు సత్యరాజ్దే. ఆయన ఏ మూల వెళ్లినా కట్టప్ప అనే సంబోధించడం మొదలుపెట్టారట. అంతగా ఆయన పాత్ర పిల్లల నుంచి పెద్దలని ప్రభావితం చేసింది.
అప్పటి నుంచి వరుస తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఆయన నుంచి ఓ విభిన్నమైన చిత్రం రాబోతోంది. తమిళంలో `తీర్పుగళ్ వీర్కపడుమ్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో `ఎమర్జెన్సీ` అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రథమ శ్రేణి కెమెరాలని ఉపయోగించినట్టు తెలిసింది. ఓ తండ్రి ప్రతీకారం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సత్యరాజ్ ఏకధాటిగా 12 గంటల పాటు డబ్బింగ్ చెప్పడం విశేషం అని చిత్ర బృందం వెల్లడించింది.
ఓ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ తన కూతురికి జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన కథగా తెలిసింది. థీరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ని దర్శకుడు మారుతి ట్విట్టర్ ద్వారా సోమవారం విడుదల చేశారు. త్వరలో టీజర్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.