బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మరోసారి వీరనారిగా కనిపించబోతోందా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఝాన్సీలక్ష్మీబాయ్గా నటించిన చారిత్రక చిత్రం `మణికర్ణిక`. 2019లో అనేవి విమర్శలు, వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి సంచలనాలు సృష్టించింది. ఈ మూవీకి త్వరలో సీక్వెల్ని తెరపైకి తీసుకురాబోతున్నారని తెలిసింది.
`ది లిజెండ్ ఆఫ్ దిద్దా` పేరుతో ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి సీక్వెల్గా రానున్న `ది లిజెండ్ ఆఫ్ దిద్దా`ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారట. ఈ చిత్రాన్ని కూడా కమల్ జైన్ నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పిరియాడికల్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఈ చిత్రంలో కంగన యోధురాలైన కశ్మీరీ రాణిగా కనిపించనుందట.
ఒక కాలు పోలియో కారణంగా పనిచేయనప్పటికీ ఆమె గజినీని రెండు సార్లు యుద్ధంలో ఓడిస్తుంది. అలాంటి పవర్ఫుల్ యోధురాలి పాత్రలో నటించడానికి కంగన ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో మొదలుపెట్టే అవకాశం వుందని తెలిసింది. కంగన నటిస్తున్న బయోపిక్ `తలైవి`. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ మూవీని ఏ.ఎల్.విజయ్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.