కరోనా కారణంగా భారీ చిత్రాలు గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. థియేటర్లు కూడా మూసి వేయడంతో రిలీజ్కి రెడీగా వున్న సినిమాల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు సినిమాలని ఆపాలా? లేక ఓటీటీకి అమ్మేయాలా? అని నిర్మాతలు సతమతమవుతున్నారు. ఇదిలా వుంటే ప్రస్తుతం వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడం కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ భారీ చిత్రాలకు భారీ ఆఫర్లిస్తూ టెమ్ట్ చేస్తున్నాయి.
తెలుగులో ఇప్పటికే రిలీజ్కు సిద్ధంగా వున్న సినిమాలకు ఆఫర్లు ఇచ్చిన ఈ రెండు సంస్థలు తమిళ చిత్రాలని మాత్రం వెంటనే బుట్టలో వేసేస్తున్నాయి. తాజాగా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సంయుక్తంగా ఓ భారీ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టు తెలిసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏ.ఎల్.విజయ్ `తలైవి` పేరుతో బయోపిక్ని తెరకెక్కిస్తున్నారు. కంగనరనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్నారు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజాలు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ 55 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. అయితే డైరెక్ట్ రిలీజ్ మాత్రం ఈ చిత్రం థియేటర్లలోనే వుంటుందని, ఆ తరువాతే ఈ రెండు ఓటీటీల్లో `తలైవి` స్ట్రీమింగ్ అవుతుందని తెలిసింది. ఇందులో హిందీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్, తమిళ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నాయట.