కంగన రనౌత్.. బాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్లేకుండా స్టార్ హీరోయిన్గా నిలబడిన హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్. సంచలన విషయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. బాలీవుడ్ వేదికగా జరిగే ప్రతీ సమస్యపై, ప్రతి వివాదంపై కంగన తనదైన స్టైల్లో స్పందిస్తూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్లో వున్న బంధుప్రీతిపై బాహాటంగానే స్టేట్మెంట్ ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కూడా కంగన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆమెకు ప్రాణ హాని వుందా? అంటే ఆ అనుమానం వుందని గమనించిన ఆమె తల్లి కంగనతో మహామృత్యుంజయ యాగాన్ని చేయించడం బాలీవుడ్లో సంచలనంగా మారింది. బాలీవుడ్లో ఎంత పెద్దవారిపై అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శలు గుప్పించే కంగనకు అదే స్థాయిలో శతృవర్గం పెరుగుతోందని, వారి నుంచి తన కూతురిని ఆ దేవతలంతా కాపాడాలని కంగన తల్లి కోరుతూ ఆమె చేత తాజాగా యాగం చేయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో కంగన రనౌత్ షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ ` మా అమ్మ నా రక్షణ గురించి ఆందోళనకు గురవుతోంది. అందుకే లక్షా పదిహేను వేల సార్లు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించింది. అదే సందర్భంగా మహా మృత్యుంజయ యాగాన్ని జరిపించింది` అని కంగన తెలిపింది.