అక్టోబర్ 30న చిరకాల మిత్రుడు, సోల్మేట్ గౌతమ్ కిచ్లూని టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో కరోనా కారణంగా కాజల్ వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ముంబైలోని హోటల్ తాజ్లో జరిగిన ఈ వివాహానికి భారీగానే ఏర్పాట్లు చేశారు. లైట్ రెడ్ కలర్ లెహెంగాలో కాజల్ అగర్వాల్ పెళ్లి కూతురిగా మెరిసింది. గౌతమ్ కిచ్లూ వైట్ షేర్వానిలో హుందాగా కనిపించాడు.
పెళ్లై దాదాపు ఐదు రోజులు గడుస్తున్న నేపథ్యంలో కాజల్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ అభిమానులతో పాటు నెటిజన్స్ని షాక్కు గురిచేస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు.. నో చెప్పేస్తా.. అంటూ కాజల్ పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. `నేను కొంత ఆలస్యంగా స్పందిస్తున్నానని నాకు తెలుసు. ఇది నేను గతంలోనే చేసి వుండాల్సింది. అయినా ఏమీ ఫరవాలేదు. నా భావాల్ని ఈ ప్రపంచానికి లెటర్ రూపంలో తెలియజేస్తున్నందుకు నన్ను క్షమించండి. ఇదే నాకు సులభంగా వుంది. ఈ విషయాన్ని చెప్పకుండా ఆ తరువాత బాధపడే కంటే ఇప్పుడే చెప్పడం మంచిది.. అంటూ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించేలా లెటర్ని పోస్ట్ చేసింది.
కాజల్ లెటర్ని పోస్ట్ చేసింది మరేదో విషయం చెప్పాలని కాదు.. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న మహమ్మారి వైరస్ గురించి. `ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని మార్చేస్తుందని నేనూ ఊహించలేదు. పరిష్కారం లేని కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం నన్నూ భయాందోళనకు గురిచేస్తోంది. భవిష్యత్తు గురించిన నా ఆలోచనల్ని మార్చేసింది. నాకు, ప్రపంచానికి అనేక సవాళ్లని విసురుతోంది. ప్రస్తుత మన పరిస్థితిని నేను అంగీకరించను. ప్రస్తుత భయానక వాతావరణానికి..ఈ అనిశ్చితికి నేను నో చెప్పేస్తా` అని కాజల్ తన లెటర్లో స్పష్టం చేసింది.