వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ట్రెండ్ సెట్టర్ `శివ`. ఈ మూవీతో జేడీగా తనదైన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు జేజీ చక్రవర్తి. ఆ తరువాత హీరోగా మారిన ఆయన పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఆయతే గత కొంత కాలంగా సెలెక్టీవ్గా సినిమాలు చేస్తూ వస్తున్నారాయన.
తాజాగా ఆయన నటించిన చిత్రం `70 ఎం.ఎం`. ఈ మూవీ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దివంగత నటి సౌందర్య పెళ్లి గురించి పలు ఆసక్తిర విషయాల్ని వెల్లడించి షాకిచ్చారు. సౌందర్యని తాను పెళ్లి చేసుకోవాల్సిందని, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని స్పష్టం చేశారు.
`ప్రేమకు వేళాయెరా` మూవీ చిత్రీకరణ సమయంలో తనకూ, సౌందర్యకు పెళ్లి చేయాలని ఎస్వీ కృష్ణారెడ్డి, సుచిత్రా చంద్రబోస్ చిత్ర బృందం ప్లాన్ చేశారని, ఆ విషయాన్ని తనతో చెప్పి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారని, అయితే తాను ససేమీరా అన్నానని, పెళ్లి వల్ల వృత్తి పరంగా ఇద్దరి కెరీర్లకు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పానని, ఆ తరువాత సౌందర్యకు, తనకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని జేడీ చక్రవర్తి చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది.