బాలీవుడ్లో డ్రగ్స్ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. సుశాంత్ అనుమానాస్పద మృతి చుట్టూ డ్రగ్స్ ఓ ప్రద్మప్యూహాన్ని పన్నినట్టుగా తెలుస్తున్న నేప్యంలో దీనిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై ఇటీవల పార్లమెంట్ సాక్షిగా నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జీరో అవర్లో మాట్లాడిన జయా బచ్చన్ రవికిషన్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఎవరో తప్పు చేస్తే దాన్ని బాలీవుడ్ మొత్తానికి ఆపాదించడం సరైంది కాదని దుయ్యబట్టారు.
ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయిన మరో బీజేపీ ఎంపీ, వెటరన్ నటి జయప్రద ఘాటుగా స్పందించారు. రవికిషన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, యువతను డ్రగ్స్ నుంచి కాపాడాల్సిన అవసరం ఎంతో వుందన్నారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాడే సమయం వచ్చిందని ఇందుకు అంతా ముందుకు రావాలన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం ఏమీ బాగాలేదన్నారు. బాలీవుడ్ని సేవ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చే అధికారం జయాబచ్చన్కు ఎవరిచ్చారని జయప్రద సూటిగా ప్రశ్నించారు. దీంతో వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
అంతే కాకుండా జయప్రద వెటరన్ నటి జయాబచ్చన్పై ఘాటుగా స్పందించారు. బాలీవుడ్లో జరుగుతున్న డ్రగ్స్ వివాదం గురించి చర్చ జరుగుతుంటే జయాగారు ఎందుకు ఈ విషయాన్ని మరీ పర్సనల్గా తీసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని జయప్రద విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ కు న్యాయం జరగాలని దేశం మొత్తం ఎదురుచూస్తోందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. దీంతో వెటరన్ల మధ్య ఈ ఫైట్ ఏంటని అంతా అవాక్కవుతున్నారు.