శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటించిన తాజా చిత్రం `గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్`. భారత మాజీ ఐఏఎఫ్ అధికారి గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 12న నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. అయితే ఈ సినిమాపై భారత వైమానిక దళం సీరియస్ అయ్యింది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో `గుంజన్ సక్సేనా ` చిత్రం వివాదాస్పదంగా మారింది.
ముఖ్యంగా సినిమాలో లింగ పక్షపాతం గురించి చూపించడంపై వైమానిక దళం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరో వైపు ఈ వివాదంపై జాతీయ మహిళా కమీషన్ చైర్మన్ రేఖా శర్మ మండిపడింది.. ఈ చిత్ర మేకర్స్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని రేఖా శర్మ ట్వీట్ చేసింది. సినిమాలో చూపిన విధంగా లింగ వివక్ష వుందో లేదో గుంజన్ సక్సేనా వెల్లడించాలని, ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన దానిగా ఈ విషయంలో నాకు స్పష్టత వుంది.
త్రివిద దళాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం వుంటుందని, డిఫెన్స్ అధికారులు గూండాల్లా వ్యవహరించరని తనకు బాగా తెలుసని, మహిళలని గౌరవిస్తారని ట్వీట్లో పేర్కొంది. గుంజన్ సక్సేనా ప్రస్తుత వివాదంపై క్లారిటీ ఇచ్చింది. వైమానికి దళంలో ఇలాంటి వివక్ష తనకు కనిపించలేదని వెల్లడించడంతో మేకర్స్పై ఒత్తిడి మొదలైంది. పని గట్టుకుని భారత వైమానిక అధికారుల్ని కించపరిచారని, ఆ సన్నివేశాల్ని ఖచ్చితంగా తొలగించాల్సిందేనని రేఖా శర్మ మేకర్స్ని ఈ సందర్భంగా హెచ్చరించారు.