వైసీపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ మధ్యనే గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎంతో ఫిట్ గా ఉండే ఈయన సడెన్ గా గుండెపోటు తో మరణించడం పార్టీ నేతలకు , కార్య కర్తలకే కాదు యావత్ తెలుగు ప్రజలను శోకసంద్రంలో పడేసింది. గౌతమ్ రెడ్డి గుర్తుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడుతున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో అధికారిక ప్రకటన చేసారు. గౌతమ్ రెడ్డి సంతాప తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. గౌతమ్ లేకపోయినా ఆయన కలలను తాము నెరవేరుస్తామన్నారు. సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో ప్రకటించారు.
గౌతమ్ మృతి తనకు, పార్టీకి తీరని లోటని భావోద్వేగానికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి తనకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడని.. అలాంటి గొప్ప స్నేహితుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. గౌతమ్రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్ గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి తో పాటు పలువురు మంత్రులు అసెంబ్లీ లో మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి ని తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు.