ఈ మధ్య ఫ్రెంచ్, కొరియన్ చిత్రాల కథల్ని కొట్టేయడం.. ఆ విషయం బయటపడగానే స్ఫూర్తిగా మాత్రమే తీసుకున్నామని చెప్పడం టాలీవుడ్లో ఎక్కువవుతోంది. ఫ్రెంచ్ మూవీ `లార్గో వించ్`ని యదతదంగా ఫ్రీమేక్ చేసిన మన వాళ్లు ఆ విషయం అసలు నిర్మాతలకు తెలిసే సరికి రైట్స్ రూపంలో కోట్లు ముట్టజెప్పాల్సి వచ్చింది. ఆ తరువాత కూడా ఆ విషయాన్ని ఎక్కడా ప్రకటించకుండా సినిమాని రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారు కూడా. వారి తరహాలోనే టాలీవుడ్లో చాలా మంది కొరియన్, ఫ్రెంచ్ చిత్రాల్ని ఫ్రీమేక్ చేస్తున్నారు. కొంత మంది దొరికిపోతామని కొంత మంది బయటికి చెప్పేస్తున్నారు. కొంత మంది చెప్పడం లేదు.
ఇటీవల అఫీషియల్గా కొరియన్ చిత్రాల్నిహక్కులు తీసుకుని రీమేక్ చేస్తున్న మన వాళ్లు ఇప్పుడు కొత్తగా టర్కిష్ సినిమాలపై పడ్డారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం `ఇద్దరి లోకం ఒకటే`. జి.ఆర్. కృష్ణని దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `అర్జున్రెడ్డి` ఫేమ్ షాలిని పాండే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని టర్కిష్ సినిమా `లవ్ లైక్ కో ఇన్సిడెన్స్` ఆధారంగా రూపొందించారు. అయితే ఆ చిత్రాన్నిస్ఫూర్తిగా మాత్రమే తీసుకుని `ఇద్దరి లోకం ఒకటే` చిత్రాన్ని చేశామని హీరో రాజ్ తరుణ్ సోమవారం తనని కలిసిన మీడియాతో చెప్పుకొచ్చారు. ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ అని, ఒకే జోనర్లో సినిమా సాగుతుందని స్పష్టం చేశారు.