తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్నతాజా చిత్రం `దర్బార్`. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై అల్లిరాజా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. `మూండ్రు ముగమ్` తరువాత మళ్లీ రజనీ పోలీస్ పాత్రలో నటిస్తున్న సినిమా కావడం, ఏ.ఆర్.మురుగదాస్ తో తొలిసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సహజంగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం మంగళవారం ముంబైలో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజనీ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. `అమితాబ్ బచ్చన్ అంటే తనకు అపారమైన గౌరవమని, ఒకానొక సందర్భంలో ఆయన తనకు మూడు అమూల్యమైన సలహాల్ని అందించారని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టమని, కంటిన్యూగా పనిచేయమని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వెళ్లొద్దని మూడు సలహాలిచ్చారని అయితే అందులో మూడవ సలహాని తాను పాటించకుండా రాజకీయాల్లోకి వచ్చేశానని చెప్పడం ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ తమిళ రాజకీయాల్లో సమూల మార్పలు తీసుకురావాలని రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.
అయితే అలా రజనీ రాజకీయాల్లోకి రావడం అమితాబ్కు ఇష్టం లేదట. అందుకే ఆయన ముందే రజనీని రాజకీయాల్లోకి వెళ్లొద్దని వారించినట్టు స్వయంగా రజనీ వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ముంబై వేదికగా రిలీజ్ చేసిన `దర్బార్` ట్రైలర్ రజనీ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటూ సినిమాపై క్రేజ్ని క్రియేట్ చేస్తోంది. భారీ బడ్జెట్తో భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేస్తున్నారు.