టాలీవుడ్ తెరకు ఒకప్పుడు `పడమటి సంధ్యారాగం` సినిమాతో హలీవుడ్ నటుణ్ణి జంధ్యాల తెలుగు తెరకు పరిచయం చేయడం అప్పట్లో పెద్ద ప్రయోగంగా చెప్పుకున్నారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ తెలుగు సినిమాల్లో హాలీవుడ్ నటుల పరంపర మొదలౌతోంది. `బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత జక్కన్న రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` పేరుతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా హాలీవుడ్కు చెందిన రే స్టీవెన్ సన్, ఒలివియా మోరీస్, అలిసన్ డూడీ పరిచయమవుతున్నారు.
కోన వెంకట్ నిర్మిస్తున్న `నిశ్శబ్దం` సినిమాతో అమెరికన్ నటుడు మైఖేల్ మాడ్సన్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. వీళ్లందరి ఎంట్రీని చూస్తున్న పూరీకి మెరుపులాంటి ఆలోచన వచ్చిందట. కొత్త తరహా చిత్రాలకు ఎప్పుడూ ముందుండే పూరిజగన్నాథ్ తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో `ఫైటర్` చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్కు పరిచయం కాబోతున్నారు. కరణ్ జోహార్ భాగస్వామిగా వ్యవహరించనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారు.
విజయ్ దేవరకొండ బాక్సర్గా కనిపించనున్న ఈ సినిమాపై క్రేజ్ని పెంచడం కోసం వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ ని రంగంలోకి దింపాలనుకుంటున్నారట. ఇప్పటికే మైక్ కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించారు. `ఫైటర్`లో మైక్ టైసన్ చేత విలన్ వేషం వేయించాలని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది వర్కవుట్ అయ్యే పనేనా అని అంటున్నవారూ లేకపోలేదు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతోంది. విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వికపూర్ ని తీసుకోవాలని సంప్రదింపులు చేస్తున్నారు.