తరుణ్ భాస్కర్ రూపొందించిన చిత్రం `ఈ నగరానికి ఏమైంది`. ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ నటుడిగా, దర్శకుడిగా `ఫలక్నుమాదాస్` చిత్రంతో మంచి గుర్తింపును సోంతం చేసుకున్నారు. ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా చిత్రం `హిట్`. ఈ చిత్రం ద్వారా శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో నేచురల్ స్టార్ నాని సమర్పణలో ఆయన భార్య ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `చిఃలఃసౌ` ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ చిత్ర ట్రైలర్ని బుధవారం నిర్మాత దిల్ రాజు హైదరాబాద్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తకరమైన విషయాల్ని పంచుకున్నారు. మా సంస్థతో శైలేంద్ర తండ్రికి 25 ఏళ్ల అనుబంధం వుంది. శైలేష్ దర్శకుడిగా పరిచయం కావాలనుకుంటున్నాడని తెలిసి ఇండస్ట్రీ గురించి తెలుసుకదా ఎందుకండీ అన్నాను. కథ వినిపించి తను ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కట్ చేస్తే `హిట్` పేరుతో సినిమా చేసి తన వద్దకు వచ్చాడని, ట్రైలర్ చూస్తుంటే థియేటర్కి ప్రేక్షకుల్ని రప్పించేలా వుందని, ఈ చిత్రాన్ని నైజాం, వైజాగ్లలో తామే రిలీజ్ చేస్తున్నామని` వెల్లడించారు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ `సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే తరువాత సినిమా ఏంటీ అనే టెన్షన్ వుంటుంది. శైలేష్ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా అంగీకరించాను. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లా అనిపించింది. ఈ సినిమాకు సంబంధించి యాక్టింగ్ తప్ప మరే విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. సాధారణంగా నిర్మాతలు హీరోయిన్లని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఈ సినిమాకు మాత్రం తనని ఓ హీరోయిన్లా చూసుకున్నారని చెప్పారు.