రామ్గోపాల్వర్మకు రాష్ట్ర హైకోర్ట్ గట్టి షాకిచ్చింది. ఆయన రూపొందిస్తున్న చిత్రం `దిశ ఎన్కౌంటర్`. గత కొన్ని నెలల క్రితం షాద్ నగర్ సమీపంలో ఓ యువతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన దేశం మొత్తాన్ని అట్టుడికించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు పాల్పడిన కిరాతకుల్ని రాష్ట్ర పోలీసులు ఎన్కౌంటర్ చేశారు.
ఇదే అంశాన్ని కథాంశంగా చేసుకుని రామ్గోపాల్వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం `దిశ ఎన్కౌంటర్`. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని వర్మ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా విడుదలని నిలిపివేయాలంటూ దిశ తండ్రి హైకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటీషన్ని స్వీకరించిన కోర్టు సోమవారం విచారించింది. సెన్సార్ బోక్డు నిర్ణయం తీసుకోకముందే కోర్టుని ఎందుకు ఆశ్రయించారని వర్మని ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నారని పిటీషనర్ తరుపు న్యాయవాది ఆరోపణలకు సమాధానం చెప్పాలని వర్మకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అంతే కాకుండా సినిమా నిర్మించడానికి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? .. అసలు అనుమతులు వున్నాయా? చెప్పాలంటూ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ని ప్రశ్నించింది. దీంతో పాటు తాజా పిటీషన్పై కౌంటర్లు దాఖలు చేయాలని సెన్సార్ బోర్డ్, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్మ `దిశ ఎన్కౌంటర్` విడుదల సస్పెన్స్గా మారింది.