మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారాడు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి ఖైదీ నెం 150తో మంచి హిట్టు కొట్టాడు. ఇక రెండో ప్రయత్నంగా మెగాస్టార్ 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించాడు రామ్ చరణ్. ఇది భారతదేశ మొదటి పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ కావడంతో ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమాను తీయాలని నిర్ణయించుకున్నారు. అందుకే బాలీవుడ్ నుండి అమితాబ్ ను, తమిళ్ నుండి విజయ్ సేతుపతి, నయనతార, కన్నడ నుండి సుదీప్ ఇంకా ఇతర నటీనటులను వివిధ ఇండస్ట్రీల నుండి తీసుకున్నారు.
ఇక్కడి వరకూ కథ బానే ఉంది. అయితే ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల అంటే మాటలు కాదు. దానికి ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరగాలి. ముఖ్యంగా బాలీవుడ్ లో నెల ముందు నుండైనా హడావిడి చేయాలి. బాహుబలి, సాహో అప్పుడు ప్రభాస్ బాలీవుడ్ మీడియాకి ఎన్నేసి ఇంటర్వ్యూలు ఇచ్చాడో అందరూ గమనించారు. అందుకే ప్రభాస్ కు నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్ వచ్చింది.
ఇంకా సైరా విడుదలకు రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇంకా పాటలు విడుదల కాలేదు, టీజర్ మినహా ఇంకే ఇతర ప్రమోషనల్ మెటీరియల్ లేదు. ట్రైలర్ రేపు విడుదల కాబోతోంది. ఐదు భాషల్లో విడుదల కావాల్సిన సినిమాకు ఇంకా ఒక్క చోట కూడా ప్రమోషన్ మొదలుపెట్టకపోవడం నిర్మాతగా రామ్ చరణ్ ఫెయిల్యూర్ అనవచ్చా?