యావత్ దేశాన్ని కరోనా వణికిస్తున్న వేళ ఫిల్మ్ మేకర్స్, సినీ తారలు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. కరోనా కారణంగా సినిమాల రిలీజ్లకు బ్రేక్ పడింది. థియేటర్లు మూసివేయడంతో సినిమాల రిలీజ్లు ప్రశ్నార్థకంగా మారిపోయింది. దీంతో చాలా మంది తమ సినిమాలని డిజిటల్ మాధ్యమాలైన ఓటీటీలకు అమ్మేస్తున్నారు. భారీ ఆఫర్లు ఇవ్వడంతో అదే బాగుందని వరుసగా తమ సినిమాలని ఓటీటీలకు అమ్మేస్తున్నారు.
దీంతో ఓటీటీలకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో హీరో, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు ఓటీటీల వైపు అడుగులు వేయడం మొదలుపెట్టారు. తమిళంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన హన్సిక గత కొంత కాలంగా హారర్ థ్రిల్లర్ చిత్రాలకే పరిమితం అవుతోంది. తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్కు ఓకే చెప్పినట్టు తెలిసింది. డిజిటల్ రంగంలో తన సత్తా చాటాలని హన్సిక భావిస్తోందట. అందులో భాగంగానే హన్సిక ఓ వెబ్ సిరీస్ని ఓకే చేసిందని చెబుతున్నారు.
అనుష్కతో `భాగమతి` వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన అశోక్ ఈ వెబ్ సిరీస్ని రూపొందించనున్నట్టు తెలిసింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న ఓ బలమైన సమస్య నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ వుంటుందని, కొత్త పంథాలో ఈ వెబ్ సిరీస్ని దర్శకుడు అశోక్ తెరపైకి తీసుకురానున్నారని తెలిసింది.