కరోనా వైరస్ దెబ్బకి సినీ ఇండస్ట్రీ కుదేలైపోతోంది. రెండున్నర నెలలుగా ఒక్క సినిమా షూటింగ్ లేదు. ఒక్క సినిమా రిలీజ్ లేదు. షూటింగ్లకు అనుమతులిచ్చినా కరోనా భయంతో స్టార్ హీరోలు బయటికి రావడానికి సాహసించడం లేదు. దీంతో దర్శకులు, నటులు ప్రత్యామ్నయ మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం సినీ రంగం ముందుకున్న ఏకైక మార్గం ఓటీటీ.
ఇప్పటికే చాలా వరకు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. టాలీవుడ్లో మాత్రం ఇంకా ఆ సంప్రదాయం స్టార్ట్ కాలేదు. కారణం థియేటర్స్ ఓపెన్ చేస్తారనే చిన్న ఆశ. కరోనా వైరస్ హైదరాబాద్లో ప్రబలుతున్న నేపథ్యంలో థియేటర్లు తెరిచే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మేకర్స్, దర్శకులు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నందినిరెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్రెడ్డి ఓటీటీల కోసం వెబ్ సిరీస్లు చేశారు.
క్రిష్ కూడా ఓ వెబ్ సిరీస్ని నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో వీరి జాబితాలో స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ కూడా చేరబోతున్నారట. రానాతో మైథలాజికల్ ఫిల్మ్ `హిరణ్యకశ్యప`ని తెరపైకి తీసుకురాబోతున్న ఆయన దానికంటే ముందు ఓ వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించనున్నారని, ఆయనే స్వయంగా నిర్మించనున్నారని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని గుణశేఖర్ వెల్లడించనున్నట్టు తెలిసింది.