యాక్షన్ హీరో గోపీచంద్ గత కొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన హిట్ అనే మాట విని దాదాపు ఐదేళ్లవుతోంది. లౌక్యం తరువాత గోపీచంద్ ఇప్పటి వరకు 7 చిత్రాల్లో నటించారు. అందులో ఓ ఒక్కటీ విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో మళ్లీ సంపత్నందినే నమ్ముకున్నారు. తాజాగా ఆయన సంపత్నంది దర్శకత్వంలో ఓ సినిమాని అంగీకరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ లాంఛనంగా ప్రారంభమైంది.
తమన్నా కథానాయికగా నటిస్తున్నీ చిత్రాన్ని శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో గోపీచంద్ ఆంధ్రా ఉమెన్స్ కబట్టీ టీమ్ కోచ్గా కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి `సీటీమార్` అనే టైటిల్ని దర్శకుడు కన్ఫమ్ చేసినట్లు తెలిసింది. తమన్నా కూడా గోపీచంద్ తరహాలోనే తెలంగాణ కబడ్డీ టీమ్కి కోచ్గా కనిపించనుందని సమాచారం. అజీజ్ నగర్లో వేసిన భారీ సెట్లో ఇప్పటికే పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు.
గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజమండ్రి, ఢిల్లీల్లో చిత్రీకరించబోతున్నారు. మరో నాయికగా `హిప్పీ` ఫేమ్ దిగాంగన సూర్యవన్షీ నటిస్తోంది. రెండు షెడ్యూళ్లల్లో చిత్రాన్ని పూర్తి చేసి సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు సంపత్నంది ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్, సంపత్ నందిల కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రమిది.