యాక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వరసపెట్టి తన సినిమాలు అన్నీ బాల్చీ తన్నేస్తుండడంతో అసలు తన ఇమేజ్ ఇప్పుడు ఎలా ఉంది. తన బడ్జెట్ పరిమితులు ఎంత? తనకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి అనేది సమీక్షించుకుంటున్నాడు. ముఖ్యంగా చాణక్య ఫలితంతో గోపీచంద్ లో కదలిక వచ్చింది. దసరా సెలవులలో విడుదలై కనీసం 5 కోట్ల షేర్ తెచ్చుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో గోపీచంద్ లో అంతర్మధనం మొదలైంది. ప్రస్తుతం చేతిలో ఉన్న రెండు సినిమాలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడు. భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో ఒకటి, సంపత్ నంది దర్శకత్వంలో మరొకటి చిత్రాలు గోపీచంద్ ఖాతాలో ఉన్నాయి. భోగవల్లి ప్రసాద్ విషయంలో పాజిటివ్ గా ఉన్న గోపీచంద్, సంపత్ నంది సినిమాకు మార్పులు అవసరమని భావిస్తున్నాడట.
సంపత్ నంది, కథ చెప్పినప్పుడే ఇది ఒక భారీ బడ్జెట్ చిత్రం అనడంతో ఇప్పుడు బడ్జెట్ తగ్గించడానికి ప్రయత్నించడం లేదా ఈ కథను పక్కన పెట్టి వేరే కథతో ముందుకు వెళ్లడం. ఇలా ఏదో ఒకటి ఆలోచించమని సంపత్ నందితో గోపీచంద్ అన్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే తన కెరీర్ లో హిట్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్ కారణంగానే వచ్చినవి కావడంతో యాక్షన్ మూవీ అయినా కుడా ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఇవ్వాలని దర్శకులకు సూచిస్తున్నాడట. కాస్త ఆలస్యమైనా మొత్తానికి గోపీచంద్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు అని అంటున్నారు విశ్లేషకులు.