కొత్త తరహా కథలకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్న విషయం తెలిసిందే. దీంతో మూస కథలకు భిన్నంగా వస్తున్న న్యూ ఏజ్ సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటీవల పక్కా నేటివిటితో రూపొందిన `కేరాఫ్ కంచరపాలెం` విజయం సాధించి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డుల్ని దక్కించుకోవడంతో ఈ తరహా చిత్రాల నిర్మాణం ఇటీవల ఎక్కువైంది. తాజాగా ఇదే తరహాలో కొత్త తరహా మేకింగ్తో వస్తున్న చిత్రం `పలాస 1978`.
1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కొత్త వాళ్లతో పాటు సంగీత దర్శకుడు రఘు కుంచె ఈ చిత్రంలోని కీలక పాత్రలో నటించారు. నక్షత్ర కథానాయిక. కరుణకుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవల పూరి జగన్నాథ్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్కు మంచి స్పందన లభించింది. సహజత్వానికి దగ్గరగా దర్శకుడు కరుణ కుమార్ రూపొందించిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా రిలీజ్ కోసం చాలా రోజులుగా చిత్ర నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. కథ కథనం, తెరపైకి తీసుకొచ్చిన తీరు యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 వారికి నచ్చడంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. పగా ప్రతీకారం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.