`మహర్షి` బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరోసారి మహేష్బాబుతో కలిసి సినిమా చేయబోతున్నానని దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించారు. `సరిలేరు నీకెవ్వరు` చిత్ర ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన మహేష్ తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయబోతున్నట్టు వెల్లడించారు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికి తెలిసిందే. వంశీ పైడి పల్లి చిత్రాన్ని మహేష్ పక్కన పెట్టి ఆ స్థానంలో పరశురామ్తో `సర్కారు వారి పాట`కు రెడీ అయిపోయారు.
దీంతో మరో హీరో కోసం గత కొన్ని నెలలుగా వేట మొదలుపెట్టిన వంశీ పైడిపల్లి మొత్తానికి సాధించాడు. మెగాపవర్స్టార్ రామ్చరణ్ని ఒప్పించారు. మహేష్ తరువాత ఎన్టీఆర్, రామ్చరణ్లతో సినిమా చేయాలని ప్రయత్నాలు చేసిన వంశీ పైడిపల్లి మొత్తానికి రామ్చరణ్ని ఒప్పించారు. ప్రస్తుతం రామ్చరణ్ `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తరువాత రైట్ ఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్న రామ్చరణ్కు వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ విపరీతంగా నచ్చిందట. దీంతో వెంటనే అతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు లేదా రామ్ చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొనిదెల ప్రొడక్షన్స్ నిర్మించే అవకాశం వుందని తెలసింది.