వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్`తో మళ్లీ ట్రాక్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీతో అటు రామ్ కెరీర్కు, తన కెరీర్కి బూస్టప్ని అందించిన పూరి జగన్నాధ్ రెట్టించిన ఉత్సాహంతో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ బైలింగ్వల్ మూవీని ముంబై నేపథ్యంలో మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
ముంబై వీధుల్లో అర్థ్రరాత్రి ఛేజింగ్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాల్ని చిత్రీకరించిన పూరి ఆ తరువాత కొంత భాగాన్ని హైదరాబాద్లో షూట్ చేశాడు. కరోనా ప్రభావం ప్రారంభం కావడం.. వెంటనే లాక్డౌన్ ప్రకటించడంతో పూరి షూటింగ్ని ఆపేయాల్సి వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నవంబర్ నుంచి షూటింగ్లకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా పూరి తన పాన్ ఇండియా మూవీని తిరిగి ప్రారంభించలేదు.
చైనా ఫైటర్స్ కారణంగానే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ని వాయిదా వేస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారట. ఇదిలా వుంటే మార్చి లో లాక్డౌన్ మొదలైన దగ్గరి నుంచి పూరి ముంబైలోనే వుండిపోయారట. తాజాగా ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టారని తెలిసింది. అంటే దాదాపు ఏడాది కాలం పాటు ఇంటికి, హైదరాబాద్కి పూరి దూరంగా వుండటం చర్చనీయాంశంగా మారింది. పూరి ఓ టీవీ షోలో పాల్గొనడం కోసమే హైదరాబాద్ వచ్చారని, రెండు రోజుల తరువాత మళ్లీ తిరిగి ముంబై వెళ్లిపోతారని చెబుతున్నారు.