పవర్స్టార్ పవన్ కల్యాణ్ దాదాపు మూడేళ్ల విరామం తరువాత నటించిన చిత్రం `వకీల్ సాబ్`. శ్రీరామ్ వేణు రూపొందించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవర్స్టార్ పవర్ఫుల్ వకీల్సాబ్ పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం వరల్డ్ వైడ్గా భారీ స్థాయిలో విడుదలై అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. మూడేళ్ల తరువాత అభిమాన హీరో సినిమా రిలీజ్ కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
థియేటర్లు అభిమానుల పూనకాలతో హోరెత్తిపోతున్నాయి. ఎక్కడ చూసిన పవన్ నామస్మరణే. గురువారం అర్థ్ర రాత్రి నుంచే పవన్ అభిమానుల హంగామా మొదలైంది. ఇక షో మొదలుకు ముందు నుంచే రక్తాభిషేకం మొదలుపెట్టారు. భారీ సంఖ్యలో గుమిగూడిన పవన్ ఫ్యాన్స్ థియేటర్లల వద్ద కొబ్బరి కాయలు కొడుతూ పొటేళ్లని బలిచ్చి రక్తాభిషేకం చేశారు. ఇక షో మొదలు కాగానే చేతి ఏళ్లు కోసుకుని పవన్ ఇంట్రడక్షన్ సీన్కి స్క్రీన్పై `పీఎస్పీకే` తమ రక్తంతో రాస్తూ నానా రచ్చ చేశారు.
ఓ అభిమాని రక్తంతో స్క్రీన్పై `పీఎస్పీకే` అని రాస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆకలి మీద వున్న పులి ముందు మేకల గుంపుని వదిలినట్టు మూడేళ్లుగా పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు `వకీల్ సాబ్` రూపంలో భారీ బ్లాక్ బస్టర్ లభించడంతో ఒక్కొక్కరు పూనకం వచ్చినట్టుగా మారి తమ అభిమానాన్ని ప్రదర్శించడం, తమ అభిమాన హీరోకు రక్తాభిషేకం చేయడం చర్చనీయాంశంగా మారింది.